
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శనివారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం తొలిసారిగా ఆలూరు నియోజకవర్గానికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జిల్లా యంత్రాంగం కూడా సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1:10 గంటలకు ఆస్పరి హెలిప్యాడ్కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:20 గంటల నుంచి 2:50 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం ‘సంజీవని’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని సీఎం సందర్శించనున్నారు.
అక్కడ వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించి సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత సాయంత్రం 3:45 గంటల నుంచి 5:35 గంటల వరకు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటనపై ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను ఘనవిజయం చేస్తామని, వేలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు సభకు హాజరవుతారని తెలిపారు.

