
హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లిన స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న సహచర సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి ఆయన మృతిచెందినట్లు గుర్తించారు.
ఘటన స్థలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుబట్టవద్దని, వారు ఎంతో మంచివారని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, వారిని ఎప్పటికీ కాపాడుతానంటూ భావోద్వేగంగా రాసినట్లు తెలిసింది.
సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

