
ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల లభ్యత బాగా తగ్గిపోవడంతో.. అధిక ధరలకు బ్లాక్లో , అది కూడా అతి కష్టం మీద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో చాలా మంది హోటల్ యజమానులు తమ హోటళ్లను మూసేశారు. అయితే పరిగికి చెందిన ఓ హోటల్ నిర్వాహకుడిని మాత్రం వంట గ్యాస్ కష్టాలు ఏమాత్రం ఇబ్బందిపెట్టలేదు. దీనికి కారణం ఆయన బయోమాస్ పెల్లెట్స్ వాడుతుండటమే.
అయితే తెలంగాణలో పరిగికి చెందిన భవానీ హోటల్ నిర్వాహకుడు మోహన్ రెడ్డిని మాత్రం వంటగ్యాస్ కష్టాలు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. గత 16 ఏళ్లుగా ఆయన తన హోటల్లో ఎల్పీజీ గ్యాస్ను వాడకపోవడమే దీనికి కారణం. అలాగని కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారేమో అనుకోకండి. వంట కోసం ఆయన బయోమాస్ పెల్లెట్స్ వాడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ ఆ హోటల్ వంట గదిలోకి వెళ్లి మరీ మోహన్ రెడ్డితో మాట్లాడారు.
మోహన్ రెడ్డి గత 16 సంవత్సరాలుగా బయోమాస్ పెల్లెట్స్ను వంట కోసం ఉపయోగిస్తున్నారు. వీటిని వాడటం కోసం ఆయన ప్రత్యేకంగా రూపొందించిన స్టవ్ను ఉపయోగిస్తున్నారు. పెల్లెట్స్ను రాజేసి, నిరంతరాయంగా మంట రావడం కోసం ఈ స్టవ్కు ఓ బ్లోయర్ అమర్చి ఉంది. పెల్లెట్స్ వాడటంతో గ్యాస్కయ్యే ఖర్చులో సగం ఖర్చుతోనే వంటలు పూర్తవుతున్నాయని ఆయన తెలిపారు. అప్పట్లోనే బెంగళూరు నుంచి తెప్పించిన హైదరాబాద్ వ్యాపారుల దగ్గర్నుంచి.. ఈ స్టవ్ను రూ.10 వేలకు కొనుగోలు చేశానన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఒక్కో స్టవ్కు రూ.50 వేల నుంచి రూ.60 వేలకు డిమాండ్ చేస్తున్నారని మోహన్ రెడ్డి తెలిపారు. బయోమాస్ పెల్లెట్స్ను వాడటం వల్ల పొగ సమస్య కూడా ఉండదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్యాస్ కొరత నేపథ్యంలో అందరూ ఈ పెల్లెట్లను వాడాలని సూచించారు.

