
- మరో తుఫాను ముంచుకొస్తోంది. మొంథా తుఫాను ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 24వ తేదీకల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
- ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో తుఫాన్గా మారి నైరుతి బంగాళా ఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
- తుఫాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తుఫాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సూచించిన ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
- ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని మోడళ్లు, కోస్తా, రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి.
