
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఈరోజు ( నవంబర్ 21, 2025 ) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రాథమిక సమాచారం మేరకు.. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారిమిట్ట ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్పై నియంత్రణ కోల్పోయింది. బస్సు రహదారి అంచునకు రావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది, క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారందరికీ తేలికపాటి గాయాలే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను విచారిస్తున్నారు.
