
కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వేదికగా న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే.. కూలీల ప్రయోజనాల దృష్ట్యా కొత్త ‘వీబీజీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ క్యాబినేట్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ మంత్రివర్గ సమావేశంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే కేంద్ర నిబంధనలపై న్యాయస్థానంతో పాటు పార్లమెంట్లోనూ నిలదీయాలని నిశ్చయించారు. అదే సమయంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం నాడు సచివాలయంలో జరిగిన రాష్ట్ర తొలి డిజిటల్ క్యాబినేట్ సమావేశం పలు చారిత్రాత్మక, వ్యూహాత్మక నిర్ణయాలకు వేదిక అయింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ప్రవేశ పెట్టిన ‘వీబీ-జీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూనే.. అందులోని కొన్ని నిబంధనలపై సుప్రీం కోర్టులో లీగల్ బ్యాటిల్ చేయాలని మంత్రివర్గం సంచలన తీర్మానం చేసింది. ఈ చట్టం జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో అమల్లోకి రానుంది.
క్యాబినేట్ భేటీ అనంతరం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్రాలను సంప్రదించకుండా, కనీసం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ చట్టాన్ని రుద్దడం పట్ల క్యాబినేట్ తీవ్ర నిరసన తెలిపింది. గ్రామీణ కూలీల ఉపాధి భద్రతకు సంబంధించిన ‘ఉపాధి హామీ పథకం’ (ఎంజీఎన్ఐర్ఈజీఎస్) లో మార్పులు చేయవద్దని ఈ ఏడాది జనవరిలోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని క్యాబినేట్ గుర్తు చేసింది.

