
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జూన్ 20వ తేదీన అదృశ్యమైన ఐదేళ్ల నిఖిల్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. రైల్వే ప్లాట్ఫామ్పై తప్పిపోయి ఏడుస్తూ.. తనను పొరపాటున ‘డాడీ’ అని పిలిచినందుకు ఆ చిన్నారిని ఏకంగా 12 రోజుల పాటు ఇంట్లోనే దాచిపెట్టిన నిందితుడు షేక్ అహ్మద్ అలీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. డాడీ అని పిలవడంతో.. అతడిని తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నానని.. అందుకే అతడిని వెంట తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
భాగ్యనగరంలో విపరీతమైన రద్దీ కల్గిన రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో గత నెలలో జరిగి కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తనను పొరపాటున ‘డాడీ’ అని పిలిచినందుకే ఆ చిన్నారిని ఏకంగా 12 రోజుల పాటు తన ఇంట్లోనే బంధించి పెంచాలనుకున్న అతడు.. మీడియాలో వస్తున్న వరుస కథనాలకు భయపడి చిన్నారితో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. బాలుడిని సురక్షితంగా కన్నతల్లి చెంతకు చేర్చారు.
ఉప్పల్ చిలకానగర్ పరిధిలో నివసించే రాపు రాజేశ్వరి కుమారుడు నిఖిల్ (5) తన అమ్మమ్మ స్వరూపతో కలిసి విజయవాడ వెళ్లేందుకు జూన్ 20వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. అయితే ఇంట్లో గొడవలు రావడంతో.. ఇలా వాళ్లు ఊరెళ్లాలడానికి బయలుదేరారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్కు చేరుకున్నాక.. అక్కడే 1వ నంబర్ ప్లాట్ఫామ్పై స్వరూప, మనవడు నిఖిల్ను పక్కన కూర్చోబెట్టుకుని విశ్రాంతి తీసుకుంటుంది. ఈక్రమంలోనే స్వరూపకు నిద్ర పట్టగా.. నిఖిల్ ఆమెకు చెప్పకుండా ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన స్వరూప.. తిరిగి ఉప్పల్కు చేరుకుని కూతురు రాజేశ్వరికి విషయం చెప్పింది.

