
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎంపిక చేసిన పంటల సాగుకు ప్రభుత్వం రాయితీలు కూడా అందిస్తోంది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. కాఫీ సాగు చేస్తున్న రైతులతో ప్రయోగాత్మకంగా యాలకుల సాగును కూడా చేపట్టిస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంటగా యాలకులను సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా వినూత్న పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాఫీ, స్ట్రాబెర్రీ, అవకాడో, ఆపిల్ వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఇటీవల కుంకుమపువ్వు సాగుపై కూడా ప్రయోగాలు చేపట్టగా మంచి ఫలితాలు వచ్చాయి.
తాజాగా మరో కొత్త పంట సాగుకు శ్రీకారం చుట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతంలోని గిరిజన కాఫీ రైతులతో ప్రయోగాత్మకంగా యాలకుల సాగు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పాడేరు మండలం గొండెలి పంచాయతీ పరిధిలోని లంపెలిలో యాలకుల మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ టి.నిషాంతి స్వయంగా మొక్కలు నాటి ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు.
కాఫీ తోటలతో పాటు యాలకుల సాగు చేపట్టడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని కలెక్టర్ నిషాంతి తెలిపారు. యాలకుల సాగు విజయవంతమైతే మరింత మంది గిరిజన రైతులను ఈ పంట వైపు ప్రోత్సహించే అవకాశం ఉంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వాతావరణ పరిస్థితులు యాలకుల సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు గిరిజన రైతులు కాఫీ తోటల్లోని నీడ ప్రాంతాల్లోనే యాలకులను సాగు చేయవచ్చని చెప్పారు. తద్వారా కాఫీతో పాటు యాలకుల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
యాలకులను సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్ లభించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించి నాణ్యమైన యాలకులను పండిస్తే కిలోకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు ధర లభించే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం పాడేరు మండలం లంపెలిలో ప్రయోగాత్మకంగా యాలకుల సాగును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా గిరిజన రైతులను యాలకుల సాగు వైపు ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిషాంతి వెల్లడించారు.

