
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా చట్టపరమైన సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టెలీ లా విధానాన్ని తెచ్చింది. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్తో మీసేవ, కామన్ సర్వీస్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు లాయర్లు ఉచితంగా ఫోన్ చేసి న్యాయ సలహాలు ఇస్తారు. గృహహింస, భూతగాదాలు, ఎఫ్ఐఆర్, ఆర్టీఐ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఇందులో పరిష్కారాలు లభిస్తాయి. 15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఉచిత న్యాయ సలహాలు అందుతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సామాన్యులకు ఏదైనా చిన్న న్యాయపరమైన సమస్య ఎదురైనా టెన్షన్ పడుతుంటారు. సమస్య పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలి, లాయర్ ఫీజు ఎంత ఉంటుంది, అసలు కోర్టుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందోననే ఆందోళన వారిలో మొదలవుతుంది. ప్రస్తుత రోజుల్లో ఒక చిన్న చట్టపరమైన సమాచారం తెలుసుకోవాలన్నా కూడా వేల రూపాయల ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం టెలీ లా అనే వినూత్న విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సామాన్యులు నేరుగా హైకోర్టు న్యాయవాదుల నుంచి ఉచితంగా తమ మాతృభాషలోనే చట్టపరమైన సలహాలు పొందేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతోంది.
ఈ టెలీ లా వేదిక ద్వారా విభిన్న రకాల సమస్యలపై న్యాయ సలహాలు పొందే వీలుంటుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక నేరాలు, కుటుంబ లేదా ఆస్తి, భూతగాదాలపై సలహాలు తీసుకోవచ్చు. వీటితో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధులు తమ ప్రాథమిక హక్కుల సాధన, ఉపాధి సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధిలో ఎదురయ్యే అవరోధాలు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు, అరెస్టు చేసిన వ్యక్తిని నిర్బంధించడం, సమాచార హక్కు చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, మోటారు వాహన చట్టాల వంటి అనేక రకాల సమస్యలకు న్యాయవాదుల ద్వారా సరైన పరిష్కార మార్గాలు పొందవచ్చు.

