
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంతో హత్య జరిగింది. అయితే దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోలేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆరోపించారు. అయితే జిల్లా ఎస్పీ కిషోర్ మాత్రం పోలీసులు వైఫల్యం లేదంటున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన కారుమూరి దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. దుర్గారెడ్డికి రక్షణ కల్పించాలని తన కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పినా ఎస్సై పట్టించుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ వ్యాఖ్యలు చేయడం హాట్టాపిక్ అయ్యింది. దుర్గారెడ్డి హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. దుర్గా రెడ్డి హత్యకు లా అండ్ ఆర్డర్ వైఫల్యమే కారణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం ఎస్సైకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి తన పీఏ ఫోన్ చేశారని.. దుర్గా రెడ్డి సమస్య గురించి చెప్పామని.. ఈలోపే హత్య జరగడం దారుణమన్నారు. దుర్గారెడ్డిని హత్య చేసిన నిందితుల్ని 24 గంటల్లో పట్టుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసులు వైఫల్యం లేదని ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు. దుర్గారెడ్డికి తన సోదరుడు వెంకటరెడ్డితో ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుర్గారెడ్డి, వెంకటరెడ్డి కుటుంబాలకు చెందిన నలుగుర్ని బైండోవర్ కేసులు నమోదు చేయడానికి జంగారెడ్డిగూడెం పోలీసులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు పోలీస్ స్టేషన్కు వస్తే తహసీల్దార్ దగ్గర బైండోవర్ చేయించామన్నారు. దుర్గారెడ్డి బైండోవర్కు రాలేదని.. పోలీసులు పొగాకు రైతుల ధర్నా కార్యక్రమం దగ్గర బందోబస్తులో ఉన్నట్లు తెలిపారు. దుర్గారెడ్డి వివాదాస్పద భూమి దగ్గరకు వెళ్లగా జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగిందన్నారు. దుర్గారెడ్డి హత్యకేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు.

