
తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త రైల్వే లైన్.. నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటోంది. కాజీపేట-విజయవాడ మధ్య కీలక మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 219 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. తెలంగాణ, ఏపీ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఈ మార్గం ప్రయాణికులకే కాకుండా సరుకు రవాణాకు కూడా కీలకంగా మారనుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే కీలకమైన విజయవాడ-కాజీపేట మార్గంలో మూడో రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలక అప్డేట్ వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్లో అత్యంత రద్దీగా ఉండే ఈ విజయవాడ-కాజీపేట మార్గంలో మరిన్ని రైళ్ల రాకపోకలు సాగించేందుకు వీలుగా.. రైల్వే శాఖ చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన చివరి దశకు చేరుకుంది. విజయవాడ నుంచి కాజీపేటకు మొత్తం 219 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టులో ఇప్పటికే 199 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణంతోపాటు.. విద్యుదీకరణ పనులు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
చిన్న చిన్న పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన రైల్వే శాఖ పూర్తి చేస్తోంది. త్వరలోనే విజయవాడ-కాజీపేట మధ్య పూర్తి స్థాయి రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. ఏపీ, తెలంగాణ మధ్య రవాణా రంగంలో సరికొత్త మార్పులు చోటుచేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ మార్గంలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది.
విజయవాడ-కాజీపేట కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే.. ప్రయాణికులతోపాటు సరుకు రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రైల్వే లైన్.. విజయవాడ-కాజీపేట మధ్య నిత్యం కొనసాగే రైళ్ల రద్దీని గణనీయంగా తగ్గించనుంది. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల రైళ్లు ఆలస్యం కాకుండా మరింత వేగంగా.. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. ఈ విజయవాడ-కాజీపేట మార్గం బొగ్గు, సిమెంట్ రవాణాకు అత్యంత కీలకంగా ఉంది. ఈ కొత్త లైన్ ద్వారా గూడ్స్ రైళ్ల రాకపోకలు మరింత వేగవంతమైతే.. పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకులు కూడా సరైన సమయానికి చేరనున్నాయి. ఈ మార్గంలో పూర్తి స్థాయి విద్యుదీకరణ కారణంగా ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా.. పర్యావరణహితమైన రవాణా అందుబాటులోకి రానుంది.

