
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం కెల్ల వద్ద సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది.
సుమారుగా 8 వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశలలో ఈ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీని ద్వారా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ చేరాయి. ఈ సందర్భంగా కిమిడి కళా వెంకట్రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మాట్లాడిన కిమిడి కళా వెంకటరావు.. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చీపురుపల్లి నియోజవర్గంలో 8 వేల కోట్ల రూపాయలతో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
మరోవైపు చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. కెల్ల సమీపంలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం కెల్ల సమీపంలో 1,085 ఎకరాల భూమిని కేటాయించింది.
