
శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందించనున్నట్లు పాలకమండలి పోతుగుంట రమేష్నాయుడు తెలిపారు. స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు రెండు లడ్డూలు, అతిశీఘ్ర దర్శనం చేసుకునే వారికి ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.
అలాగే, గోకులం ప్రాంతాన్ని ఆధునికీకరిస్తున్నారు. కొత్త డొనేషన్ కౌంటర్, చైర్మన్ ఛాంబర్, ఉచిత లడ్డూ ప్రసాద కౌంటర్, కైలాస కంకణ కౌంటర్లను కూడా ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ రమేష్నాయుడు చెప్పారు. ఈ మార్పులన్నీ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇటీవల ధర్మకర్తల మండలి సమావేశంలో శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలు అందించాలని నిర్ణయించారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్పై 100 గ్రాముల రెండు లడ్డూలు, రూ.300 టికెట్పై 100 గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని తీర్మానించారు. ఈ నిర్ణయం డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. మొత్తం 14 అంశాలపై చర్చించి 11 అంశాలను ఆమోదించి.. 2 అంశాలను వాయిదా వేసి, ఒక అంశాన్ని తిరస్కరించారు.
శ్రీశైల దేవస్థానం, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న కొలనుభారతి అమ్మవారి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ దత్తత ప్రక్రియతో, శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకుల ప్రాంతాన్ని మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా, స్థానికంగా నివసించే చెంచులకు ఒక ప్రత్యేక సౌకర్యం కల్పించనున్నారు.
ప్రతి నెలా ఒక రోజు, వారు శ్రీమల్లికార్జునస్వామి వారి స్పర్శ దర్శనాన్ని ఉచితంగా పొందవచ్చు. భక్తులకు మరింత సమాచారం అందించేందుకు, కేంద్ర విచారణ కార్యాలయంలో (CRO) డిజిటల్ డిస్ప్లేలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గదుల లభ్యత, దర్శన టిక్కెట్ల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే, భక్తులు తమ సమస్యలను, సూచనలను తెలియజేయడానికి వీలుగా సీఆర్ఓ కార్యాలయం వద్ద ఫిర్యాదుల పెట్టెలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భక్తుల అభిప్రాయాలు నేరుగా ఆలయ అధికారులకు చేరుతాయి.
