
తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఆళ్లగడ్డ హైవే మీద ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా శివలింగం దర్శనం ఇచ్చింది. 33 అడుగుల పొడవుతో.. 210 టన్నుల బరువున్న భారీ రాతి శివలింగాన్ని చూసి శివయ్య భక్తులు మురిసిపోతున్నారు.
ఈ శివలింగాన్ని దర్శించుకున్నందుకు తమ జన్మ ధన్యం అయ్యింది అంటున్నారు. మరి ఇంత భారీ శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించబోతున్నారు.. ఎక్కడ రూపుదిద్దుకుంది.. ఎంత ఖరీదు అయ్యింది వంటి ఆసక్తికర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఈ శివలింగాన్ని బిహార్లోని చంపారన్ జిల్లాలో ప్రతిష్ఠించనున్నారు. దీన్ని తమిళనాడులోని మహాబలిపురం నుంచి చంపారన్ తరలిస్తున్నారు. 114 టైర్లున్న భారీ హైడ్రాలిక్ ట్రక్కు మీద ఈ శివలింగాన్ని తరలిస్తున్నారు. ఈక్రమంలో ఆళ్లగడ్డ హైవే మీద ఈ భారీ శివలింగం దర్శనం ఇచ్చింది. ఇది గమనించిన స్థానికులు ఏపీలో దర్శనం ఇచ్చిన అత్యంత ఎత్తైన శివలింగం అంటూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఈ శివలింగం సుమారు 33 అడుగుల పొడవు ఉంది. 210 మెట్రిక్ టన్నుల బరువున్న ఈ శివలింగం విలువు రూ.3 కోట్లు. మహాబలిపురం నుంచి బిహార్ చేరడానికి దాదాపు 20-25 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. శివలింగం బరువును దృష్టిలో ఉంచుకుని దీన్ని తరలించడానికి.. 114 టైర్లున్న హైడ్రాలిక్ ట్రక్ని వినియోగిస్తున్నారు.
ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో.. ఈ భారీ శివలింగాన్ని బిహార్ కు తరలిస్తున్నారు. శివలింగాన్ని ప్రతిష్టించబోయే విరాట్ రామాలయం ఎత్తు… కంబోడియాలోని 12వ శతాబ్దపు అంగ్కోర్ వాట్ ఆలయం కన్నా మరింత ఎత్తుగా ఉండేలా డిజైన్ చేసి నిర్మిస్తున్నారు.
