
రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ మెడికో ప్రియాంకకు అండగా నిలిచింది. పెద్ద మనసుతో ప్రియాంక కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించారు.. కాలేజీలో నిర్వహించిన సంతాప సభలో సాయం గురించి ప్రకటన చేశారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు అందిస్తామని జీఎస్ఎల్ ఎండీ డాక్టర్ గన్ని సందీప్ తెలిపారు. త్వరలోనే ప్రియాంక కుటుంబానికి కలిసి అందజేస్తామని సందీప్ చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో మృతిచెందిన వైద్య విద్యార్థిని ప్రియాంకకు ఆమె చదువుతున్న జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ కూడా అండగా నిలిచింది. ప్రియాంక కుటుంబాన్ని ఆదుకునేందుకు రాజానగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకించింది. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షలు అందిస్తామని జీఎస్ఎల్ ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు.ప్రియాంక జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ఫస్టియర్ చదువుతోంది.. కాలేజీలో ప్రియాంక సంతాప సభను నిర్వహించి ఈ సాయం గురించి ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల పరిహారాన్ని ప్రకటించిందన్నారు ఎండీ గన్ని సందీప్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారన్నారు. ప్రియాంకను బతికించుకునేందుకు తండ్రి, కుటుంబం చేసిన పోరాటానికి సహకరించి, తాము మొదటి నుంచి అండగా ఉన్నామన్నారు. త్వరలోనే జీఎస్ఎల్ డెర్మటాలజీ విభాగం డాక్టర్లు, విద్యార్థులు హైదరాబాద్ వెళ్లి ప్రియాంక కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. తమ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా గన్ని సాధిక రూ.20 లక్షల చెక్కు ఆ కుటుంబానికి అందజేస్తారని తెలిపారు.
మరోవైపు ప్రియాంక మృతదేహానికి హైదరాబాద్లో పోస్టుమార్టం నిర్వహించి సొంత ఊరు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్కు తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం అంతిమయాత్ర నిర్వహించగా.. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ, చేనేత కార్మికులు, పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఇటు ఏపీ మంత్రి టీజీ భరత్ ప్రియాంక భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. కుటుంబాన్ని పరామర్శించారు. ఏపీ ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల చెక్కును ప్రియాంక తండ్రి వెంకటేశ్కు అందించారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.. ప్రియాంకకు ఆస్పత్రిలో అయిన వైద్య ఖర్చులతో పాటుగా మెడికల్ ఫీజు సీటుకు సంబంధించిన ఖర్చులను అందిస్తామన్నారు. ఏపీ పోలీసులు తాను ఫిర్యాదు చేయకుండానే ముందే కేసు నమోదు చేశారని ప్రియాంక తండ్రి వెంకటేశ్ తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

