
ఐసీసీ టీ 20 వరల్డ్కప్ 2026లో భారత్ జింబాబ్వేపై 256/4 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. చెపాక్లో జరిగిన ఈ మ్యాచ్లో అబిషేక్ శర్మ అర్ధశతకం, హార్దిక్ పాండ్యా అజేయ ఫిఫ్టీతో భారత్ భారీ స్కోర్ సాధించింది. మొత్తం 17 సిక్సర్లు బాది ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ స్కోర్ టీ20 వరల్డ్కప్ చరిత్రలో రెండో అత్యధికంగా నిలిచింది. దీంతో భారత్ సెమీఫైనల్ ఆశలను బలపరుచుకుంటూ, రికార్డుల పేజీల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
సౌతాఫ్రికాపై ఎదురైన ఘోర పరాజయం మరిచిపోయేలా జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. సూపర్ 8 కీలక మ్యాచ్లో భారత బ్యాటర్లంతా ఫామ్లోకి వచ్చి చెన్నై చెపాక్ స్టేడియంలో రికార్డుల మోత మోగించారు. చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 256/4 పరుగులు చేసి వరల్డ్కప్ హిస్టరీలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. మరో ఐదు పరుగులు చేసుంటే టీ20 ప్రపంచకప్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా నిలిచేది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు, ఈ మ్యాచ్లో 17 సిక్సర్లు బాదింది. ఇంకొక్క సిక్స్ బాదుంటే, శ్రీలంక 2007లో చేసిన రికార్డును కూడా చెరిపేసేది. ఈ ఘన విజయానికి ప్రధాన కారణం యువ అభిషేక్ శర్మ. ఇటీవల వరుసగా డకౌట్లతో ఫామ్ కోల్పోయిన అతడు, ఈ మ్యాచ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. సంజూ శాంసన్తో 48 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత ఇషాన్ కిషన్తో 72 పరుగుల జోడీతో భారత్కు పటిష్టమైన ఆరంభం అందించాడు.

