
ఇళ్లకు తాళాలు వేసి ఉన్న నివాసాలను లక్ష్యంగా చేసుకుని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లాల దొంగను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు.
బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన ఒంటిపులి శ్రీనివాసులు 2016 నుంచి ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు.
దొంగతనానికి ముందు ఆయా ప్రాంతాల్లో పగటిపూట తిరుగుతూ ఇళ్లను పరిశీలించడం, ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత రాత్రి సమయంలో చోరీ చేయడం నిందితుడి పద్ధతిగా పోలీసులు గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పాకాల, పలమనేరు తదితర ప్రాంతాల్లో అతడిపై కేసులు ఉన్నట్లు తెలిపారు.
సుమారు 20 కేసుల్లో నిందితుడు ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడి కదలికలు, గత నేర చరిత్ర ఆధారంగా దర్యాప్తు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అరెస్టుతో పలు దొంగతనాల కేసులు కొలిక్కి వచ్చినట్లు తెలిపారు.
ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు. విలువైన వస్తువుల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
