
రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి జల్లులు పత్తి, మొక్కజొన్నకు ఊపిరి పోశాయి. మొన్నటి వరకు ఎండ తీవ్రతకు పత్తి, మొక్కజొన్న మొక్కలు వాలిపోయాయి. ఈ వర్షంతో మొక్కలు ప్రాణం పోసుకున్నాయి. వరిని సాగు చేసే రైతులకు వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా పోసిన నార్లు ముదిరిపోతున్నాయి. ఒక సెంటిమీటర్ వర్షపాతమే నమోదైంది. ఎక్కడ చూసిన చెరువులు, కుంటల్లో పది శాతం నీళ్లు కూడా చేరలేదు.
అవి పశువులకే సరిపోతాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు డివిజన్లో గట్టిగా వర్షం కురిసిన సందర్భాలు లేవు. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయ పంటలు వైపు రైతులను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్లో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జూన్ చివరి వారంలో కురిసిన ఒకటి రెండు చిన్నపాటి వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మొలకెత్తిన వర్షాలు కరువకపోవడంతో అవి భూమిలోనే పొట్లిపోయాయి. మళ్లీ రైతులు పత్తి విత్తనాలు విత్తారు.
అవి మొలిశాయి. ఈ నెల ప్రారంభం నుంచి వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రతకు మొక్కలు వడలిపోయి ఎండు ముఖం పట్టాయి. రెండ్రోజులుగా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసుకన్నాయి. డివిజన్లో హుజూరాబాద్, ఇల్లందకుంట, జమ్మికుంట, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాలున్నాయి. 1.2 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఉంది. గత ఏడాది 80 వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. ఈ సారి వర్షాలు కురవకపో వడంతో పొలాలు బీడుగా మారాయి. అనుకూలమైన వర్షాలు కురిస్తేనే వరి నాట్లు పడతాయి.

