
అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ తన మాజీ భార్య, నటి కీర్తి రెడ్డితో విడాకులు మరియు రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. పెళ్లి సమయంలో ఇద్దరికీ తగినంత మెచ్యూరిటీ లేకపోవడమే తాము విడిపోవడానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ తమ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోందని, కీర్తి రెడ్డి కుటుంబంతో కూడా అనుబంధం ఉందని తెలిపారు. ప్రస్తుతం తనకు రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని స్పష్టం చేశారు.
అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ నటుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘సత్యం’, ‘గోదావరి’, ‘మళ్లీ రావా’, ‘సీతారామం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన ఇటీవల ‘న్యూటన్స్ థర్డ్ లా’ వంటి క్రైమ్ థ్రిల్లర్తో అలరించారు. అయితే సినిమాలతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా కీర్తి రెడ్డితో విడాకులు, రెండో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్గా మారాయి.
సుమంత్ – కీర్తి రెడ్డి 2004లో పెళ్లి పీటలెక్కారు. రెండేళ్లకే అంటే 2006లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. అయితే తమ మధ్య మనస్పర్థలు గానీ, పెద్ద గొడవలు గానీ ఏమీ లేవని సుమంత్ స్పష్టం చేశారు. “మా పెళ్లి సమయానికి ఇద్దరికీ జీవితంపై సరైన మెచ్యూరిటీ, అవగాహన లేవు. మేము విడిపోవడానికి అదొక్కటే ప్రధాన కారణం. మా జీవితం ఒక సినిమా కథలా సాగింది. విడాకులనేవి గతాన్ని మోస్తూ బాధపడటానికి కాదని, ఒకరినొకరు క్షమించుకుని జీవితంలో ముందుకు సాగడమే ముఖ్యం’ అని ఆయన ఎంతో పరిణతితో చెప్పుకొచ్చారు.
చాలామంది దంపతులు విడాకుల తర్వాత శత్రువులుగా మారడం చూస్తుంటాం. కానీ తమ విషయంలో పరిస్థితి పూర్తిగా వేరని, విడిపోయినా ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉన్నామని సుమంత్ తెలిపారు. కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు సుమంత్ను ఇప్పటికీ తమ సొంత ఇంటి మనిషిగానే ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కీర్తి రెడ్డి స్వయంగా వచ్చి సుమంత్ను, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఫోన్లో పలకరించుకుంటూ పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటున్నామని సుమంత్ చెప్పారు.

