
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశ ఐక్యత, అభివృద్ధికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన 125వ జయంతి సందర్భంగా రాసిన బ్లాగ్లో ముఖర్జీ జీవితాన్ని స్మరించుకున్న ప్రధాని, ఆయనను ధైర్యానికి, దేశభక్తికి చిరస్థాయిగా నిలిచే ప్రతీకగా అభివర్ణించారు. “డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితం ధైర్యానికి కాలాతీత ఉదాహరణ.
మాతృభారతి పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, వ్యక్తిగత సౌకర్యాల కంటే దేశ సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అన్నారు.
విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూసేందుకు ముఖర్జీ కీలక పాత్ర పోషించారని ప్రధాని గుర్తు చేశారు. అనంతరం జమ్మూకశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలనే లక్ష్యంతో ఆయన పోరాడారని, జైలు జీవితం కూడా ఆయన సంకల్పాన్ని మార్చలేకపోయిందని చెప్పారు. నిర్బంధంలోనే ఆయన జీవితం ముగిసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు.
2019లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఏ) నిబంధనలను రద్దు చేయడాన్ని డాక్టర్ ముఖర్జీ ఆశయాలకు తగిన నివాళిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఈ నిబంధనలను తొలగించడం ద్వారా దేశ సమైక్యత మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు.

