
ఆంధ్రప్రదేశ్లో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డబ్బులు కూడా విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల భూసేకరణపై విచారణ జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెప్పారు.. ఉగాది పండుగకు కానుకను ప్రకటించారు. ఈసారి ఉగాదికి రెండు రోజుల ముందు 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి, గృహప్రవేశాలు చేయించామని గుర్తు చేశారు. అంతేకాదు ఈ ఏడాది జూన్ నాటికి మరో 2.50 లక్షలు, సెప్టెంబరు నెల నాటికి మరో 2.10 లక్షలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో గృహనిర్మాణశాఖ బడ్జెట్ పద్దులపై చర్చలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది ఇప్పటికే సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఒకవేళ రాష్ట్రంలో ఇంకా ఎవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు నిర్మించే బాధ్యత తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ 2029 నాటికి ఇళ్ల స్థలాలిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హుల ఎంపిక ప్రారంభించామని.. 2.20 లక్ష మందికి ఇంటి స్థలాలు లేనట్లు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అందరికి అవకాశం ఇస్తామని.. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా స్థలాలు లేకపోతే జీ+2 తరహాలో ఇళ్ల నిర్మాణాల చేపడతామన్నారు.

