
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. కూటమి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జనసేన కమిటీలను ప్రకటించగా.. తాజాగా టీడీపీ 28 జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జ్లను నియమించింది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, పార్టీ శ్రేణుల సమన్వయం, కూటమి పార్టీల మధ్య సమన్వయం వంటి బాధ్యతలను వీరు పర్యవేక్షించనున్నారు.
అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలకు అప్పగించడం విశేషం.
జిల్లాల వారీగా ఇన్చార్జ్లు
పార్వతీపురం మన్యం – దాడి రత్నాకర్, అల్లూరి సీతారామరాజు – పేరాబత్తుల రాజశేఖర్, శ్రీకాకుళం – ఎండీ నజీర్, విజయనగరం – ఎంపీ చింతకాయల విజయ్, విశాఖ – ఎంఏ షరీఫ్, అనకాపల్లి – కొండపల్లి అప్పలనాయుడు, పోలవరం – కె. సత్తిబాబు, కాకినాడ – సుజయ్ కృష్ణరంగారావు, కోనసీమ – ఎంపీ సానా సతీష్, తూర్పుగోదావరి – దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమగోదావరి – ఎంపీ భాష్యం రామకృష్ణ, ఏలూరు – ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కృష్ణా – కొమ్మాలపాటి శ్రీధర్, ఎన్టీఆర్ – మక్కెన మల్లికార్జునరావు, గుంటూరు – ఎంవీ సత్యనారాయణరాజు, పల్నాడు – కొనకళ్ల నారాయణ, బాపట్ల – జంగా కృష్ణమూర్తి, ప్రకాశం – ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మార్కాపురం – ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నెల్లూరు – ఎస్వీఎస్ఎన్ వర్మ, తిరుపతి – నూకసాని బాలాజీ, చిత్తూరు – దామచర్ల సత్య, కడప – దీపక్ రెడ్డి, అన్నమయ్య – ఎమ్మెల్సీ శ్రీకాంత్, అనంతపురం – ఏరాసు ప్రతాప్రెడ్డి, శ్రీసత్యసాయి – సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు – పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, నంద్యాల – వైకుంఠం ప్రభాకర్ చౌదరి.
కుప్పం నేతలతో చంద్రబాబు భేటీ
మరోవైపు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంచాయతీ, మండల, జెడ్పీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ పదవులు తీసుకున్న వారు బాధ్యతగా పనిచేయాలని, ఫలితాల్లో తేడా వస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. త్వరలో కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు.. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.
