
D news: రేణిగుంట: పట్టణంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న గంగ జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. జాతరకు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం రేణిగుంట పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్. జయచంద్ర ఆధ్వర్యంలో వ్యాపారులు, దుకాణదారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర సమయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. రహదారులను ఆక్రమించకుండా, దుకాణాల ముందు వస్తువులను రోడ్డుపై ఏర్పాటు చేయవద్దని సూచించారు. వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి ఉంచాలని తెలిపారు.
అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని సీఐ జయచంద్ర తెలిపారు. ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించి గంగ జాతరను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

