
ఆంధ్రప్రదేశ్లోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంగళవారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు. తన ఎక్స్ ఖాతా వేదికగా వివరించారు.
‘ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి రంగాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ ఫుడ్ క్లస్టర్తో మా భాగస్వామ్యాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఏపీలో ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేయడానికి, ఆహార శుద్ధి రంగంలో వాణిజ్యం, ఎగుమతులు, పెట్టుబడులను ప్రోత్సహించడానికి యూఏఈ ఫుడ్ క్లస్టర్ కట్టుబడి ఉంది. దావోస్లో జరిగిన మా చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ ఇంత వేగంగా కార్యరూపం దాల్చడం ప్రోత్సాహకరంగా ఉంది.
ఈ సహకారంలో భాగంగా తొలి పెట్టుబడిగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులో ఆహార శుద్ధి యూనిట్ ఏర్పాటు చేయడానికి దుబాయ్కు చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్. రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించిందని ప్రకటించడానికి కూడా నేను సంతోషిస్తున్నా. యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి, ఆర్థిక అధ్యయనాలు, విధానాల సహాయ అండర్ సెక్రటరీ మరియా అల్ ఖాసింలను కలవడం చాలా ఆనందంగా ఉంది’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

