
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున బుధవారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.
వచ్చే రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మేఘావృత వాతావరణం కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

