
సైబరాబాద్ సహా, అమరావతి నిర్మాణం కోసం భగవంతుడు అవకాశాలు కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్నో కుట్రలు చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని అంటే నాలుగు ఆఫీసులు కడితే సరిపోదని, అమరావతిలో నవ నగరాల అభివృద్ధికి రూపకల్పన చేశామన్నారు. అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ప్లాన్ చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు.
గతంలో మూడు రాజధానులంటూ మూడుముక్కలాటలు ఆడారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ప్లాన్ -B అంటూ కొత్త వాదన తెస్తున్నారని ఎద్దేవా చేశారు. మావిగన్ అంటూ ఏవేవో చెబుతున్నారు.. మావిగన్ పేరు పలకడం కూడా కష్టంగా ఉందన్నారు చంద్రబాబు. దేశమంతా అమరావతిని నిలబెట్టేందుకు మద్దతిస్తే.. మన వాళ్లే మనకు ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేసిందన్నారు చంద్రబాబు.
ఈ ప్రాంతాన్ని ఎడారి అని.. కులం రంగు పులిమారని ఆరోపించారు. అమరావతిపై బురదజల్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. భూములు ఇవ్వకుండా రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టినా.. 29వేల మంది రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు.
భవిష్యత్ తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినయోగించుకోవాలనే మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా భవనాలను కూడా నిర్మించేలా ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్లను నియమించామని చంద్రబాబు తెలిపారు. నార్మన్ ఫోస్టర్స్ ద్వారా నగరాన్ని బ్లూ, గ్రీన్ సిటీగా, అధునాతన నగరంగా అమరావతిని తీర్చిదిద్దేలా ప్రణాలికలు చేశామన్నారు.
రహదారులు, విద్యుత్ కోసం డక్ట్ లు, క్లీన్ అండ్ గ్రీన్ విధానంలో చేపట్టామని, ప్రజలు వాక్ టూ వర్క్ , ఎమర్జెన్సీ 5-10-15 నిముషాలు అనే విధానం నగర నిర్మాణంలో చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగపూర్ తో ఒప్పందం చేసుకుంటే, సింగపూర్ పైన అబాండాలు వేసి ఒప్పందాలన్నీ రద్దు చేశారన్నారు. అమరావతి బ్రాండ్ ను కూడా దెబ్బతీశారని చంద్రబాబు మండిపడ్డారు.

