
పత్తి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించింది. ఇప్పుడు జిన్నింగ్ మిల్లుల్లోనూ రైతులు పత్తిని అమ్ముకోవచ్చు. కాగా, తేమ 18 శాతం ఉన్నా.. తడిసిన, రంగు మారిన పత్తిని కూడా కొనుగోలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, తేమతో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ డిమాండ్ చేశారు
రాష్ట్రంలోని పత్తి రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పత్తి కొనుగోలు కేంద్రాలను పెంచింది. ఈ మేరకు రాష్ట్రంలోని 11 మార్కెట్ యార్డులతో పాటు 64 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పటివరకు 19 జిన్నింగ్ మిల్లుల ద్వారా.. 72,240 క్వింటాళ్ల పత్తి సేకరించామని వెల్లడించారు. ఈ సందర్భంగా పత్తి రైతుల ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా గతంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు వినతిపత్రం కూడా పంపించామన్నారు. తమ వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
