
ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సూచించారు
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తీపికబురు చెప్పారు. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇటీవల విడుదల చేయగా.. తాజాగా మూడో విడత నిధుల విడుదలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత లబ్ధిని ఫిబ్రవరిలో అందిస్తామని తెలిపారు. ఈ నెల 21న రెండో విడత కింద రూ.7వేలు చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో విడతలో రూ.6వేలు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20వేలు జమ చేస్తోంది.. అందులో రూ.6వేలు కేంద్రం ఇస్తుండగా.. ఏపీ ప్రభుత్వం మరో 14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు ఇస్తోంది.
