భక్తులకు ముఖ్య గమనిక.. అరుణాచలం ఆలయంలోకి కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం విధించనున్నారు. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలయ పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భక్తులు ఆలయానికి వెళ్లే ముందు నిషేధిత వస్తువుల వివరాలను తెలుసుకుని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయంలో భక్తులకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని అధికారులు నిషేధించనున్నారు. భక్తులు తమ ఫోన్లను రూ.5 రుసుముతో భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

తిరువణ్ణామలై ఆలయంలో మొబైల్ ఫోన్లపై నిషేధం
తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రసిద్ధ అన్నామలైయార్ (అరుణాచలం) ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ యంత్రాంగం కీలక సూచనలు జారీ చేసింది. 2026 సెప్టెంబర్ 1 నుంచి ఆలయంలోకి మొబైల్ ఫోన్లను తీసుకురావడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు, గర్భగుడి పరిసరాల్లో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తమిళనాడు ఆలయాల్లో కొత్త నిబంధనలు
తమిళనాడులోని దేవాలయాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై హిందూ మత, ధార్మిక దానాల శాఖ ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తోంది. ఆలయాల పవిత్రతను కాపాడటంతో పాటు ఆగమ సంప్రదాయాలను పరిరక్షించడం, దర్శన సమయంలో భక్తులు ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఆలయాలకు ప్రముఖులు, వీఐపీలు వచ్చినప్పుడు వారి ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా ఆంక్షలు విధించారు. వీఐపీ దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సంబంధిత భక్తులకు తెలియజేయాలని ఆలయ అధికారులకు సూచించారు.
తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం తిరువణ్ణామలై అన్నామలైయార్ ఆలయానికి నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి, ప్రత్యేక పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆలయ పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని మొబైల్ ఫోన్ల నిషేధ నిబంధనలను ఆలయ యంత్రాంగం కఠినంగా అమలు చేయనుంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో అరుణాచలేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
ఆలయ పరిపాలన విభాగం ప్రకటన ప్రకారం ముఖ్యమైన నిబంధనలు ఇవే..
మొబైల్ ఫోన్లను ఎక్కడ డిపాజిట్ చేయాలి?
భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లకుండా ఉండేందుకు భద్రతా కేంద్రాల్లో డిపాజిట్ చేసే సదుపాయాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దర్శనం పూర్తయ్యాక భక్తులు తమ ఫోన్లను తిరిగి తీసుకోవచ్చు.
- ఆలయ తూర్పు వైపున ఉన్న రాజగోపురం సమీపంలో రెండు మొబైల్ భద్రతా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- ఉత్తర వైపున ఉన్న అమ్మని అమ్మన్ గోపురం సమీపంలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- దక్షిణ వైపున ఉన్న తిరుమంజన గోపురం సమీపంలో ఒక కేంద్రం ఏర్పాటు చేశారు.
- ఒక్కో మొబైల్ ఫోన్కు రూ.5 రుసుము చెల్లించి, టోకెన్ తీసుకుని ఫోన్ను భద్రతా కేంద్రంలో అప్పగించవచ్చు.
- దర్శనం అనంతరం టోకెన్ చూపించి తమ మొబైల్ ఫోన్ను తిరిగి తీసుకోవచ్చు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆలయం లోపలికి మొబైల్ ఫోన్లను అనధికారికంగా తీసుకెళ్లే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ ఫోన్ను ఆలయంలోకి తీసుకెళ్లినట్లు గుర్తిస్తే, ఆ ఫోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. సంబంధిత వ్యక్తులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆలయ యంత్రాంగం స్పష్టం చేసింది.
ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అన్నామలైయార్ ఆలయం భక్తుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శివుని దర్శనం కోసం ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో గిరివలం కోసం తరలివచ్చే భక్తులతో తిరువణ్ణామలై కిక్కిరిసిపోతుంది.
ఆలయంలో మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు, రీల్స్ చిత్రీకరించడం వల్ల దర్శనానికి అంతరాయం కలగకుండా, ఆలయ ప్రశాంతతతో పాటు పవిత్రతను కాపాడేందుకు మొబైల్ ఫోన్ నిషేధ నిర్ణయం ఉపయోగపడుతుందని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

