
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కోట్లాది మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. నేడు ప్రతి భారతీయుడి హృదయంలో జాతీయ పతాకం రెపరెపలాడుతోందని అన్నారు.
స్వర్ణాంధ్ర సాధనకు అందరూ ఏకం కావాలి
‘ఒక రాష్ట్రం–ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ తమ ప్రభుత్వ విధానమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమన్నారు.
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని చెప్పారు.
కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకమై ‘స్వర్ణాంధ్ర’ సాధనకు కృషి చేయాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

