
ఏపీలోని పట్టణాల్లో ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్పై కొత్త పాలసీ తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు పట్టణాల్లో పైప్డ్ గ్యాస్ ఉండగా.. మరికొన్ని చోట్ల పైపులు వేయాల్సి ఉంది. అయితే పీఎన్జీ గ్యాస్ వాడేవారికి సబ్సిడీ కూడా ఇస్తారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో గ్యాస్, పెట్రోల్ లభ్యత విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చారనే ప్రచారం కూడా జరగడంతో.. ప్రజల ఆందోళన మరింత ఎక్కువైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని చెబుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా పైప్డ్ గ్యాస్ (పీఎన్జీ)పై కొత్త పాలసీ తీసుకురావాలని భావిస్తోంది.. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) సరఫరా, వినియోగం పెంచేలా కేబినెట్లో చర్చిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రత్యామ్నాయ గ్యాస్ వినియోగం పెరగాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారని.. అందుకే కొత్త పాలసీ అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.34 లక్షల మంది పీఎన్జీ వినియోగిస్తున్నారని తెలిపారు. కేంద్రం పైప్డ్ గ్యాస్ విషయంలో రాయితీలు ఇస్తోందని.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
పట్టణాల్లో ప్రజలు పైప్డ్ గ్యాస్ కోసం నమోదు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల సూచించారు. పీఎన్జీతో పాటుగా సోలార్, ఇండక్షన్ స్టవ్ల వినియోగం పెరిగేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరతలేదని.. కానీ సోషల్ మీడియాలో వదంతులతో కొందరు ముందు జాగ్రత్తగా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా గ్యాస్ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా, ఏవైనా అక్రమలు జరుగుతున్నా టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేదని కూడా స్పష్టం చేశారు.

