
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పలు ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు మంత్రివర్గం పరిపాలన అనుమతులు కల్పించింది. అదే సమయంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి చట్టబద్ధత కల్పిస్తూ.. ఏపీ మంత్రివర్గం చారిత్రత్మకమైన తీర్మానం చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్-5ని సవరించాలని కేబినెట్ తీర్మానించింది. ఇక కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. సీఆర్డీఏ పరిధిలోని అమరావతి పేరును కొత్త రాజధానిగా చేర్చాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 4 గంటల పాటు రాజధాని అమరావతిపై చర్చను నిర్వహించి.. తీర్మానించాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఈ సమావేశాల్లోనే రాజధాని అమరావతిగా ఆమోదం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజధాని అమరావతి చరిత్రను.. రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

