
ఉక్రెయిన్, రష్యాల మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్పై యుద్దం ప్రారంభించారు. దీంతో ప్రపంచంలో చమురు సంక్షోభం మొదలయ్యింది. ఇలాంటి తరుణంలో నల్ల సముద్రంలోనూ అలజడి రేగింది. రష్యా ఆయిల్ను నింపుకున్న ఓ విదేశీ ట్యాంకర్పై గురువారం దాడి జరిగింది. టర్కీ సంస్థ ఆధ్వర్యంలోని ఈ విదేశీ జెండా నౌకపై దాడి జరిగిన విషయాన్ని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
పశ్చిమాసియా యుద్ధంతో చమురు, గ్యాస్ సంక్షోభం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉండగా నల్ల సముద్రంలో టర్కీ ట్యాంకర్ గురువారం ఉదయం దాడికి గురయ్యింది. రష్యా చమురుతో ఉన్న నౌకపై మానవరహిత వాహనంతో దాడి జరిగినట్టు టర్కీ రవాణా మంత్రి అబ్దుల్కాదిర్ ఉరలోగ్లూ తెలిపారు. ‘‘రష్యా ముడి చమురుతో ఉన్న ఓ టర్కీ సంస్థ నిర్వహించే విదేశీ జెండా నౌకలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంజిన్ గదిలో పేలుడు సంభవించినట్లు మా అత్యవసర సేవల కేంద్రానికి సమాచారం అందింది’’ అని ఆ మంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఇంజిన్ రూమ్నే లక్ష్యంగా చేసుకున్నారని మేము నమ్ముతున్నాం… డ్రోన్తో కాకుండా నీటి మట్టంలో ఉన్న మానవరహిత ఉపరితల వాహనంతో ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం’’ అని వివరించారు. సియెర్రా లియోన్ జెండా ఉన్న ట్యాంకర్పై దాడి టర్కీ జలాల్లో జరిగిందా లేదా అనే విషయాన్ని మంత్రి స్పష్టం చేయలేదు. కానీ బోస్ఫరస్ జలసంధికి 30 కిలోమీటర్లలోపే ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా నివేదించింది.

