
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి వద్ద ఒక బైకును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత పారిపోయే ప్రయత్నం చేసిన ఆమెను స్థానికులు అడ్డుకోగా, వారితోనూ పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. గతంలో రాజ్ తరుణ్పై సంచలన ఆరోపణలు చేసిన లావణ్య, ఈ ఘటనతో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలిగా పాపులర్ అయిన లావణ్య.. మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మద్యం మత్తులో హల్ చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద తన కారుతో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని లావణ్య ఢీకొట్టింది. కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. అయితే తన తప్పేమీ లేదని లావణ్య వారితో గొడవకు దిగడంతో, పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. దీంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేసి బుధవారం రాత్రి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కారులో మద్యం బాటిల్స్ చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
రెండేళ్ల క్రితం హీరో రాజ్ తరుణ్ ప్రేయసిగా లావణ్య వార్తల్లో నిలిచింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆరేళ్ల పాటు సహజీవనం చేసి మోసం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనను గుడిలో వివాహం చేసుకున్నాడని, అబార్షన్ కుడా చేయించుకునేలా తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేస్తూ, నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేసింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనను దూరం పెట్టాడని ఆరోపించింది.

