
భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. క్యూ4 ఫలితాల్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై ఆర్థిక ఫలితాలకు ఆమోదం తెలపనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఫైనల్ డివిడెండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి దశకు వచ్చింది. మరో 5 రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి.. 2026-27 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక కార్పొరేట్ కంపెనీలు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ త్రైమాసికాల వారిగా ఫలితాల్ని ప్రకటిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇటీవల జనవరిలో క్యూ3 ఫలితాల్ని వెల్లడించింది భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). ఇప్పుడు జనవరి- మార్చి త్రైమాసికం ముగియనున్న తరుణంలో.. క్యూ4 ఫలితాలపైనా ప్రకటన చేసింది. సాధారణంగా ప్రతిసారీ త్రైమాసికం ముగిసిన వెంటనే ఫలితాల్ని మొదటగా టీసీఎస్ ప్రకటిస్తుంటుంది. ఆ తర్వాత ఇతర ఐటీ కంపెనీలు, ఇతర బ్యాంకులు, ఫార్మా కంపెనీలు వంటివి ఫలితాల్ని విడుదల చేస్తుంటాయి.
2026, ఏప్రిల్ 9న (గురువారం) కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమై.. మార్చి 31తో ముగిసిన త్రైమాసికం ఫలితాలకు ఆమోదం తెలిపి.. అదే రోజు ఫలితాల్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తాాజాగా టీసీఎస్.. స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్లో వెల్లడించింది. ఇదే సమయంలో టీసీఎస్.. మరో ప్రకటన కూడా చేసింది. క్యూ4 ఫలితాలతో పాటుగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్ను కూడా ప్రకటించనున్నట్లు పేర్కొంది.

