
తెలుగుదేశం పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారం మంగళగిరిలో ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇక పొలిట్ బ్యూరోతోపాటు.. జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. కొత్త, పాత నేతలతో కలిపి పార్టీ హైకమాండ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇక టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో చోటు దక్కడం విశేషం. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడంతో పార్టీలో సరికొత్త ఉత్తేజం నెలకొంది. ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ కార్యాలయంలోని నారా లోకేష్ చాంబర్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు. అదే సమయంలో ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బర్త్ డే కావడంతో మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేక్ కట్ చేశారు.

