
ఏపీకి కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది.. దీన్ దయాల్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) రూ.207 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏపీకి 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులు ఇచ్చారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి చాలా ఉపయోగమన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో తీపికబురు చెప్పింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (NRLM) కింద నిధులు విడుదల చేసింది. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు రూ.207 కోట్ల నిధులు మంజూరు చేసింది. కేంద్రం నుంచి నిధుల విడుదల చేయడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నిధులతో మహిళలకు ఆర్థిక స్వావలంబన, కుటుంబాల ఆదాయ స్థాయిని మెరుగుపరుస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్నారు.
‘దీన్ దయాల్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.207 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసి, స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ దూరదృష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, సమగ్ర వృద్ధిలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. కేంద్రం విడుదల చేసిన ఈ నిధులలో ప్రతి రూపాయి మహిళా శక్తికి బలమైన నాంది అన్నారు. అలాగే ఆత్మ నిర్భర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి దృఢమైన అడుగుగా అభివర్ణించారు. మరోవైపు కేంద్రం రూ.207 కోట్ల విడుదల చేయడంపై సెర్ప్శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.. కేంద్రం విడుదల చేసిన నిధులకు తోడు రాష్ట్రం ప్రభుత్వం తన వాటాగా 40 శాతం విడుదల చేస్తుందన్నారు. ఈ నిధులతో డ్వాక్రా మహిళలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.

