
బంగారం కొనాలనుకునే వారికి అలర్ట్. గత కొంతకాలంగా వరుసగా పడిపోతూ వచ్చిన గోల్డ్ ధరలు ఇప్పుడు స్వల్పంగా పెరుగుదల చూపించాయి. ముఖ్యంగా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా యథాతథంగా ఉంచినా కూడా బంగారం ధరలు అంచనాలకు విరుద్ధంగా పెరగడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ డిమాండ్ తగ్గి బంగారం ధరలు పెరుగుతాయి. అదే వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినా లేదా పెంచినా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్కు విరుద్ధంగా గోల్డ్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పడిపోవడమే. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు సహజంగానే పెరుగుతాయి.
దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర ఏప్రిల్ 30 ఉదయం 11 గంటల సమయానికి రూ. 200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,100 వద్ద నమోదైంది. అంతకుముందు వరుసగా రూ. 450, రూ. 2550, రూ. 300 చొప్పున తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల శుద్ధ బంగారం ధర కూడా రూ. 220 పెరిగి తులానికి రూ. 1,50,660కు చేరుకుంది. మరోవైపు వెండి ధర మాత్రం ప్రస్తుతం మార్పు లేకుండా కిలోకు రూ. 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో వెండి ధర రూ. 5 వేల చొప్పున తగ్గింది.
తాజా జువెల్లరీ రేట్లు పరిశీలిస్తే ప్రముఖ షోరూమ్లలో లలితా జువెల్లరీలో గ్రాము బంగారం ధర రూ. 13,810గా ఉంది. తనిష్క్లో గ్రాముకు రూ. 13,915గా నమోదైంది. జోయాలుక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కల్యాణ్ జువెల్లర్స్, ఖజానా జువెల్లరీ వంటి ఇతర బ్రాండ్లలో కూడా గ్రాము ధర రూ. 13,810 వద్దనే కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,600 డాలర్లకు పైగా ఉండగా ప్రస్తుతం 4,550 డాలర్ల వద్దకు తగ్గింది. వెండి ధర కూడా 74 డాలర్ల నుంచి 72 డాలర్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం గమనించదగిన విషయం. ప్రస్తుతం రూపాయి విలువ రూ. 95.35 వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది.

