
జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను ప్రేక్షకులకు బదిలీ చేయకుండా అక్రమంగా బేస్ ధరలు పెంచి లాభపడిన వ్యవహారంలో ప్రముఖ నటుడు మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ సహా తెలంగాణలోని ఆరు థియేటర్లపై జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) కొరడా ఝళిపించింది. ఈ థియేటర్లు మొత్తం రూ. 1.7 కోట్లను సెంట్రల్, తెలంగాణ కన్స్యూమర్ వెల్ఫేర్ ఫండ్స్లో జమ చేయాలని ఆదేశించింది. ఇందులో అత్యధికంగా ఏఎంబీ సినిమాస్ రూ. 1.1 కోట్లు చెల్లించాల్సి ఉంది. టికెట్ ధరలపై పన్ను తగ్గినప్పటికీ పాత ధరలనే కొనసాగించి యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు ట్రిబ్యునల్ నిర్ధారించింది.
తెలంగాణలోని మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్ల యాజమాన్యాలకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (GSTAT) యాంటీ ప్రాఫిటీరింగ్ డివిజన్ షాకిచ్చింది. ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పన్నుల లబ్ధిని సామాన్య ప్రేక్షకులకు చేరవేయకుండా ఆ మొత్తాన్ని అక్రమంగా తామే లాభాల రూపంలో మిగుల్చుకున్న ఆరు థియేటర్లపై పెనాల్టీ విధించింది. ఈ ఆరు థియేటర్లు కలిసి మొత్తం రూ. 1.7 కోట్ల భారీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధులకు జమ చేయాలని ఆదేశించింది. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు భాగస్వామ్యం ఉన్న ప్రముఖ మల్టీప్లెక్స్ AMB సినిమాస్ కూడా ఉండటం గమనార్హం.
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యంత విలాసవంతమైన మల్టీప్లెక్స్గా పేరున్న ఏఎంబీ సినిమాస్ .. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా లాభపడినట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. గతంలో సదరు సంస్థ వాలంటరీగా డిపాజిట్ చేసిన మొత్తాన్ని మినహాయించిన తర్వాత.. ఇంకా రూ. 1.1 కోట్లను పెనాల్టీగా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతులతోనే టికెట్ ధరలు పెంచామని, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే రేట్లు సవరించామని ఏఎంబీ సినిమాస్ యాజమాన్యం చేసిన వాదనలను ట్రిబ్యునల్ పూర్తిగా తిరస్కరించింది. రాష్ట్ర స్థాయి నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నప్పటికీ.. సీజీఎస్టీ యాక్ట్లోని యాంటీ ప్రాఫిటీరింగ్ నిబంధనలను అది దాటవేయలేదని బెంచ్ స్పష్టం చేసింది.

