
భాగ్యనగరంలోని హోటళ్లు, ఫంక్షన్ హాల్సే లక్ష్యంగా చేసుకుని.. కుళ్లిపోయిన, రసాయనాలను కలిపిన మాంసాన్ని విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మటన్లో బీఫ్ కలపి, కుళ్లిపోయిన చేపలు, రొయ్యలకు సోడియం బైకార్బోనేట్ పౌడర్ను దట్టించి.. తక్కువ ధరలకే మాంసాన్ని అమ్ముతున్న ఐదుగురురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున మాంసం, సోడియం బైకార్బోనేట్ కెమికల్ పౌడర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
హైదరాబాద్లో అమాయక ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ముఠాల లీలలను పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా బట్టబయలు చేశారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద ఎత్తున జరిగే ఫంక్షన్లనే టార్గెట్ చేసుకుని తక్కువ ధరకు మటన్ ఇస్తామంటూ.. కుళ్లిపోయిన, మటన్లో బీఫ్ కలిపి అందజేస్తున్నారు. అంతేకాకుండా కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు వాసన రాకుండా రసాయనాలు చల్లి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న రెండు వేర్వేరు ముఠాలను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. పెద్ద ఎత్తున కల్తీ మాంసాన్ని, రసాయనాలు కలిపిన చేపలు, రొయ్యలను సీజ్ చేశారు.
హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో చట్టవిరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్న మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి అనే వ్యాపారి అని అధికారులు పట్టుకున్నారు. ఇతడు మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి నగరంలోని పలు పెద్ద పెద్ద హోటళ్లకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందగా.. పోలీసులు తనిఖీలు చేపట్టారు. మల్లేపల్లిలోని సదరు దుకాణంపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడు ఉస్మాన్ ఖురేషిని కస్టడీలోకి తీసుకున్నారు. సీజ్ చేసిన ఈ మాంసంలో ఏమేం కలిపారనేది నిర్ధారించడానికి.. శాంపిల్స్ను నాచారంలోని ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ లాబొరేటరీ’ కి పరీక్షల నిమిత్తం తరలించినట్లు స్థానిక సీఐ వెల్లడించారు

