
హైదరాబాద్ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు భవన సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడో అంతస్తులోని ప్రాపర్టీ రూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను వేగంగా అదుపులోకి తెచ్చాయి. ఆదివారం కావడం వల్ల కోర్టు ప్రాంగణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు కేసు నమోదు చేసి ఆస్తి నష్టంపై విచారణ జరుపుతున్నారు.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి క్రిమినల్ కోర్టు భవన సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కోర్టు ప్రధాన భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. అదృశ్యవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో కోర్టుకు సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. అయితే కోర్టుకు సంబంధించిన విలువైన సామాగ్రి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
నాంపల్లి పోలీస్ స్టేషన్, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున కోర్టు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న ఒక ప్రాపర్టీ రూమ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గదిలోని ఎలక్ట్రికల్ వైరింగ్లో ఏర్పడిన సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. క్షణాల వ్యవధిలోనే మంటలు గది మొత్తం వ్యాపించి, దట్టమైన పొగలు అలుముకున్నాయి.

