
డబ్ల్యూటీఓ మత్స్య సబ్సిడీల ఒప్పందంలో భారత్ చేరింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులకు (ఆక్వా) భారీ ఊరట లభించనుంది. ఈ నిబంధనలు సముద్ర వేటకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి ఏపీలోని ఆక్వాకల్చర్ సబ్సిడీలకు ఎలాంటి భంగం కలగదు. పైగా గ్లోబల్ మార్కెట్లో ఇంకా ఏపీ రొయ్యల విశ్వసనీయత పెరిగి అమెరికా, ఈయూ దేశాలకు ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వేదికగా భారత్ ఒక చరిత్రాత్మక డీల్ చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర మత్య్స సంపద ధ్యేయంగా అంతర్జాతీయంగా తీసుకొచ్చిన మత్య్స సబ్సిడీల నిరోధక ఒప్పందంపై భారత్ అధికారికంగా సంతకం చేసింది. 2026, జులై 20న జెనీవాలో జరిగిన సమావేశంలో భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ దీనికి సంబంధించి ఆమోద పత్రాన్ని డబ్ల్యూటీఓ డైరెక్టర్కు అందించారు. దీంతో ఈ ఒప్పందాన్ని ఆమోదించిన 123వ సభ్యదేశంగా భారత్ నిలిచింది. ఈ కీలక పరిణామంపై పలువురు పరిశ్రమ నిపుణులు స్పందిస్తున్నారు.
ఇదే విధంగా తేజస్వి పాలం అనే అకౌంట్ నుంచి కూడా ఒక ఎక్స్పర్ట్- ఇది ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల రైతులకు శుభవార్త అని కామెంట్ చేశారు. అసలు సముద్రపు చేపల వేటకు సంబంధించిన ఈ ఒప్పందం- దేశంలోనే అతిపెద్ద ఆక్వా హబ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని రొయ్యల సాగుదారులకు ఎలాంటి మేలు చేయనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక కారణమేంటో తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో అక్రమంగా చేపలు పట్టడం, మితిమీరిన వేట ద్వారా మత్స్య సంపద అంతరించిపోవడాన్ని అడ్డుకోవడమే ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి చైనా వంటి పెద్ద దేశాలు భారీ నౌకలతో వచ్చి, తమ ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల సాయంతో టన్నుల కొద్దీ చేపల్ని కొల్లగొడుతుంటాయి. తాజా ఒప్పందం ప్రకారం ఇలాంటి అక్రమ, హానికరమైన పారిశ్రామిక వేటకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడాన్ని నిషేధిస్తారు. ఈ ఒప్పందం వల్ల భారతదేశంలోని సంప్రదాయ, చిన్న తరహా మత్య్సకారుల ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండదు. మన దేశంలో పారిశ్రామిక వేట కంటే చిన్న తరహా చేపల వేటే ఎక్కువ.

