
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. జులై 22 నుంచి 24 వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000 మంజూరు చేయగా, పాఠశాలల నిర్వహణ కోసం రూ.2,000 మినహాయించి, రూ.13,000ను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.
అదే సమయంలో, ‘తల్లికి వందనం’ పేరుతో వస్తున్న నకిలీ లింకులు, ఫేక్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వేదికలనే నమ్మాలని సూచించారు.

