
అన్నమయ్య జిల్లాలో ఓ విచిత్ర ఘటన కలకలం రేపింది. కదిరి ఆర్టీసీ డిపోలో పార్క్ చేసి ఉంచిన AP39 UX 7686 నంబర్ గల ఆర్టీసీ బస్సును శివశంకర్ అనే వ్యక్తి అపహరించి పరారయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన పెంపుడు కుక్కను కూడా బస్సులో ఎక్కించుకుని కదిరి నుంచి మదనపల్లె వైపు బస్సును నడిపిస్తూ వెళ్లాడు.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం.. శివశంకర్ బస్సును అత్యంత నిర్లక్ష్యంగా నడపడంతో మార్గమధ్యంలో పలుచోట్ల ఇతర వాహనాలు, రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమవగా, ఒక వైపు భాగం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
చివరికి మదనపల్లె జాతీయ రహదారిపై తట్టివారిపల్లె వంతెన సమీపంలో బస్సును రోడ్డుపైనే నిలిపివేశాడు. స్థానికులు వెంటనే ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివశంకర్ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో బస్సును ఎందుకు తీసుకెళ్లాడని ప్రశ్నించగా.. శివశంకర్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని మానసిక పరిస్థితి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెంపుడు కుక్కతో కలిసి ఆర్టీసీ బస్సును తీసుకుని పరారైన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

