
D news: పి. గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పి. గన్నవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి త్రీ రోడ్స్ జంక్షన్ వరకు జరిగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. దేశ అభివృద్ధి, ఐక్యత కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.

