
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో చర్చ జరగాలని కోరారు.
కర్నూలు జిల్లా పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన రఘువీరారెడ్డి.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి దూరంగా ఉండటం సరికాదన్నారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్ సభకు హాజరై ఎల్నినో, కరువు పరిస్థితులపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని అన్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పంటలు కూడా సరిగా మొలకెత్తలేదని రఘువీరారెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కేంద్ర సహకారంతో రైతులను ఆదుకోవాలని సూచించారు. అవసరమైతే కృత్రిమ వర్షాలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలి
శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోతే నీటి సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు.
కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వెంటనే చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు చర్చిస్తే జల వివాదాలకు అవకాశం ఉండదన్నారు. తుంగభద్రలో ఏపీకి ఉన్న నీటి వాటాను ప్రభుత్వం కోరాలని పేర్కొన్నారు.
విద్యా రంగ సమస్యలపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘విద్యార్థి గర్జన’ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మేధో నక్సల్స్’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

