
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాజెక్టులు నిండిపోవడంతో శ్రీశైలానికి భారీగా నీరు చేరుతోంది. దీంతో జలాశయం నిండుకుండలా మారుతోంది.
జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం ఉదయం 54,865 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 25,260 క్యూసెక్కులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 168.267 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 875.90 అడుగులకు చేరింది.
శ్రీశైలానికి భారీగా నీరు చేరుతుండటంతో కాలువలు, ఎత్తిపోతలు, విద్యుదుత్పత్తి కోసం 48,765 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణ ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 7,063 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు విద్యుదుత్పత్తి నిలిపివేసింది.
మరోవైపు నాగార్జునసాగర్కు 29,250 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎస్ఎల్బీసీ ద్వారా 1,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 312.050 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 176.059 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు కూడా దాదాపు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఆలమట్టి 97 శాతం నిండగా.. 123.081 టీఎంసీల సామర్థ్యానికి 120.640 టీఎంసీల నీరు ఉంది. నారాయణపూర్లో 33.313 టీఎంసీలకు గాను 33.173 టీఎంసీల నిల్వ ఉంది. తుంగభద్రలో 105.788 టీఎంసీలకు గాను 94.819 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలానికి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. త్వరలోనే జలాశయం నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

