
వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్ యాజమాన్యానికి స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం భారీ జరిమానా విధించింది. పథనంథిట్టలోని ‘కింగ్స్ బిర్యానీ కేఫ్’లో పాడైపోయిన అరేబియన్ బిర్యానీ తినడంతో ఓ మహిళ వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఘటనపై కేఫ్ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వెళ్లిన బాధితురాలి పట్ల సిబ్బంది బాధ్యతారాహిత్యంగా, దురుసుగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుల ఫోరం.. కేఫ్ యజమానికి మొత్తం రూ.96,500 జరిమానా విధించింది. ఇందులో బాధితురాలికి జరిగిన వైద్య ఖర్చులు, నష్టానికి సంబంధించిన పరిహారం కూడా ఉంది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని ఫోరం ఆదేశించింది.
వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఓ రెస్టారెంట్ యాజమాన్యానికి కేరళలోని స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. కలుషితమైన ఆహారాన్ని విక్రయించి ఓ మహిళ అనారోగ్యానికి గురయ్యేలా చేయడమే కాకుండా, సమస్యను ప్రశ్నించేందుకు వెళ్లిన ఆమెతో దురుసుగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు రెస్టారెంట్ యజమానిపై చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఏకంగా రూ.96,500 జరిమానా విధిస్తూ ఫోరం కీలక తీర్పు వెలువరించింది. అసలు ఏం జరిగింది? ఫోరం ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కేరళలోని పథనంథిట్ట జిల్లాకు చెందిన రీనా థామస్ గతేడాది అక్టోబర్ 21న తన సోదరితో కలిసి స్థానిక ‘కింగ్స్ బిర్యానీ కేఫ్’కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి అరేబియన్ బిర్యానీని ఆర్డర్ చేసుకున్నారు. భోజనం చేసిన అనంతరం రూ.740 బిల్లును డెబిట్ కార్డు ద్వారా చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే బిర్యానీ తిన్న కొద్దిసేపటికే రీనా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరుసగా వాంతులు రావడంతో పాటు భరించలేని కడుపునొప్పి మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె తీసుకున్న ఆహారం కారణంగానే పేగుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు గుర్తించారు.
ఇన్ఫెక్షన్ తగ్గే వరకు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాలని వైద్యులు సూచించడంతో.. రీనా దాదాపు వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు.

