హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌ టూర్‌కు వెళ్లాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 4 రాత్రులు, 5 రోజుల ఈ ప్యాకేజీలో థాయ్‌లాండ్‌లోని ప్రముఖ నగరాలైన బ్యాంకాక్, పట్టాయాను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను వీక్షించడంతో పాటు థాయ్‌లాండ్‌ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన ప్రయాణ తేదీలు, ధరలు, టూర్‌లో అందించే సౌకర్యాలు, సందర్శించే ప్రదేశాలతో పాటు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే హైదరాబాద్ వాసులకు ఐఆర్‌సీటీసీ టూరిజం అదిరిపోయే థాయ్‌లాండ్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ‘Treasures of Thailand Ex-Hyderabad’ (SHO12) పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో బ్యాంకాక్, పట్టాయాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. 2026 అక్టోబర్ 28న హైదరాబాద్ నుంచి బయలుదేరి నవంబర్ 1న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్‌లో గరిష్ఠంగా 30 మంది ప్రయాణికులకు అవకాశం కల్పించారు.

విమాన ప్రయాణం, టూర్ షెడ్యూల్ ఇలా..

తొలి రోజు: అక్టోబర్ 28న ఇండిగో 6E-1067 విమానంలో ఉదయం 11:05 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4:10 గంటలకు బ్యాంకాక్ చేరుకుంటారు. విమానాశ్రయంలో అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాక హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం సాయంత్రం చావో ఫ్రయా డిన్నర్ క్రూయిజ్ను ఆస్వాదిస్తారు.

రెండో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం బ్యాంకాక్‌లోని సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్ సందర్శిస్తారు. అక్కడ లంచ్ పూర్తిచేసుకున్న తర్వాత రాత్రి భోజనం చేసి హోటల్‌లో బస చేస్తారు.

మూడో రోజు: బ్యాంకాక్ నుంచి పట్టాయాకు ప్రయాణం ప్రారంభమవుతుంది. మార్గమధ్యలో గోల్డెన్ బుద్ధ, మార్బుల్ బుద్ధ ఆలయాలను సందర్శిస్తారు. పట్టాయా చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్‌ఇన్ చేసి, సాయంత్రం ప్రసిద్ధ అల్కజార్ షోను వీక్షిస్తారు.

నాలుగో రోజు: ఈ రోజున కోరల్ ఐలాండ్ టూర్తో పాటు నాంగ్ నూచ్ ట్రాపికల్ గార్డెన్ సందర్శిస్తారు. లంచ్, డిన్నర్ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

ఐదో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి బ్యాంకాక్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. లంచ్ అనంతరం సమయం ఉంటే షాపింగ్ కోసం కొన్ని స్టాప్‌లకు తీసుకెళ్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుస్తారు. సాయంత్రం 5:10 గంటలకు 6E-1068 విమానంలో బయలుదేరి రాత్రి 7:35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు ఎంతంటే..

సింగిల్ షేరింగ్‌కు ఒక్కరికి రూ.77,100, డబుల్ షేరింగ్‌కు రూ.68,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.68,300గా ప్యాకేజీ ధరలు ఉన్నాయి. 2 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.66,050, బెడ్ లేకుండా రూ.59,350 చెల్లించాలి.

ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?

ఈ టూర్ ప్యాకేజీలో రిటర్న్ విమాన టికెట్లతో పాటు 3 స్టార్ హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సదుపాయాలు ఉన్నాయి. పర్యటనలో భాగంగా కోరల్ ఐలాండ్, అల్కజార్ షో, నాంగ్ నూచ్ గార్డెన్, సఫారీ వరల్డ్, మెరైన్ పార్క్, బ్యాంకాక్ సిటీ టెంపుల్ టూర్, చావో ఫ్రయా డిన్నర్ క్రూయిజ్ వంటి ప్రముఖ ప్రదేశాలు, కార్యక్రమాలను సందర్శించే అవకాశం ఉంటుంది. స్థానిక టూర్ గైడ్ సేవలు కూడా ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. 80 ఏళ్లలోపు భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

వీసా, ప్రయాణ నిబంధనలు

ప్యాకేజీ వివరాల ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు ప్రస్తుతం వీసా ఆన్ అరైవల్ ఉచితంగా అందుబాటులో ఉంది. అయితే థాయ్‌లాండ్‌లో ప్రవేశించే సమయంలో ఒక్కొక్క ప్రయాణికుడి వద్ద కనీసం 10,000 THB, కుటుంబానికి 20,000 THB నిధులు ఉన్నట్లు నగదు రూపంలో చూపించాల్సి రావచ్చు.

ప్రయాణికుల పాస్‌పోర్ట్ తిరుగు ప్రయాణ తేదీ నుంచి కనీసం 6 నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. బుకింగ్ సమయంలో చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్‌తో పాటు PAN కార్డు అవసరం.

ప్యాకేజీ బుకింగ్ ధృవీకరించిన తర్వాత రీఫండ్‌ సదుపాయం ఉండదు. అలాగే హోటల్ ధరలు, విమాన ఛార్జీలు లేదా పన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటే, అదనపు మొత్తాన్ని ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *