
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ కీలక ఘటనను గుర్తుచేసుకున్నారు. ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తన టీమ్ చైనా సైన్యానికి పట్టుబడిన ఘటనను వివరించారు.
సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో చైనా సైన్యం కదలికలపై నిఘా పెట్టడం, సమాచారాన్ని సేకరించడం తన విధుల్లో భాగమని దోవల్ తెలిపారు. ఒకసారి నిఘా సమాచారం సేకరించేందుకు తన టీమ్ను సరిహద్దు ప్రాంతానికి పంపినట్లు చెప్పారు. ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన బృందం 15 రోజులు గడిచినా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యానన్నారు.
ఈ క్రమంలో హెడ్క్వార్టర్స్ నుంచి సమాచారం అందిందని, తన టీమ్ను చైనా సైన్యం పట్టుకుని విచారించినట్లు తెలిసిందని దోవల్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభం కావడంతో తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు చెప్పారు.
అయితే విచారణలో తన తప్పేమీ లేదని తేలిందన్నారు. టీమ్కు హెడ్క్వార్టర్స్ నుంచి అందించిన మ్యాప్లు, స్కెచ్లలో తప్పులు ఉండటమే ఘటనకు కారణమని విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిపారు. తాను చేయాల్సిన విధులను సరిగ్గానే నిర్వర్తించినట్లు దోవల్ పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విద్యార్థులతో పంచుకున్నారు.
